కేరళ రాష్ట్రంలోని త్రిస్సురు లో 70 ఏళ్ళ వృద్ధుడి జేబులో మొబైల్ ఫోన్ పేలింది. ఈ సంఘటన గురువారం నాడు ఉదయం 10 గంటలకు చోటు చేసుకుంది. ఇల్యాస్ అనే వృద్ధుడు మరోటికల్ ప్రాంతంలోని ఓషాపులో టీ తాగుతున్నారు. అదే సమయంలో ఉన్నట్లుండి ఆయన జేబులోని ఫోన్ పేలింది. నిప్పుడు వ్యాపించడంతో ఆయన వెనువెంటనే ఫోన్ ని తీసి క్రింద పారేశారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ఒక నెల వ్యవధిలో కేరళలో ఈ తరహా ఘటన మూడవది.
న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రకారం, ఈ ఘటనలో ఎటువంటి డ్యామేజీ జరగలేదు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఒలురు పోలీస్ స్టేషన్ అధికారి తాను బాధిత వ్యక్తితో మాట్లాడినట్లు తెలిపారు. ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఏడాది క్రితం కొనుగోలు చేసిన ఫోన్
తాను ఏడాది క్రితం రూ.1000 పెట్టి ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసినట్లు ఇల్యాస్ తెలిపారు. తన ఫోన్ ఏ సమస్య లేకుండా బాగానే పని చేస్తోందని ఆయన అన్నారు. తాను చాయ్ త్రాగుతున్నప్పుడు పాకెట్ లోని ఫోన్ సడెన్ గా పేలిందని ఇల్యాస్ అన్నారు.
గత వారం కూడా కేరళలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటన
కేరళ రాష్ట్రంలోని కోళీకోడ్ లో ఒక యువకుడి పాకెట్ లోని ఫోన్ సడెన్ గా పేలింది. సదరు యువకుడు తన ఫోన్ డిస్ప్లే ని ఐదారు నెలల క్రితం రిపెయిర్ చేయించినట్లు తెలిసింది. అంతకు ముందు కూడా కేరళలో ఫోన్ పేలి 8 ఏళ్ళ బాలిక మరణించింది. అప్పుడో ఇప్పుడో దేశం నలువైపులా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఫోన్లు ఎందుకు నిప్పంటుకుంటున్నాయి?
1. ఒరిజినల్ బ్యాటరీ కాకుండా వేరేది వాడటం
2. కంపెనీ సేవా కేంద్రంలో కాకుండా బయట రిపేరు చేయించడం
3. సూచించిన చార్జర్ కాకుండా వేరేది వాడటం
4. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగించడం
5. ఫోన్ లో ఏదైనా తయారీ లోపం ఉండటం
పైన పేర్కొన్న ఐదు కారణాల వల్లన ఫోన్లు మంటల్లో చిక్కుకునేందుకు లేదా పేలేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫోన్లను జాగ్రత్తగా వాడండి. నచ్చిన విధంగా ఫోన్లను వాడకుండా, కంపెనీ భద్రతా సూచనల ప్రకారం ఫోన్ ని వినియోగించండి.
వీడియో: ఇక్కడ క్లిక్ చేయండి.












