హైలైట్స్:
- వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్, కాల్స్ కి కాసులు చెల్లించాల్సిందేనట
- ఇండియన్ టెలీకమ్యూనికేషన్ బిల్ 2022 ఆమోదం పొందితే ఫ్రీ వాట్సాప్ కాల్ సేవలు కనుమరుగు
- స్కైప్, జూమ్, టెలీగ్రామ్, గూగుల్ డువో యాప్స్ కి ఇదే వర్తింపు
భారతదేశంలోని దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు వాట్సాప్ ని ఉపయోగిస్తాడు. ఇంట్లోని అందరి వద్ద కామన్ గా ఉండే యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్ అని చెప్పాలి. అంతగా జనాల్లోకి చొచ్చుకెళ్ళింది ఈ వాట్సాప్. ఆడియో కాల్ లేదా వీడియో కాల్, చాటింగ్ ఇలా ఏదైనా సరే అందరూ ప్రథమంగా వాట్సాప్ పైనే ఆధారపడతారు. అయితే వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్. త్వరలోనే వాట్సాప్ ఫ్రీ కాలింగ్ సర్వీస్ కి తెరపడనుంది. భారత ప్రభుత్వం తీసుకురానున్న టెలీకమ్యూనికేషన్ బిల్ 2022 ఆమోదం పొందితే, ఇకపై వాట్సాప్ కాల్స్ కి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
కేవలం వాట్సాప్ మాత్రమే కాదు. స్కైప్, జూమ్, టెలీగ్రామ్, గూగుల్ డువో వంటి యాప్స్ వాడే వారు కూడా కాల్స్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇండియన్ టెలీకమ్యూనికేషన్ బిల్ 2022 పై పని చేస్తోంది. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం వీడియో కమ్యూనికేషన్, కాలింగ్ యాప్స్ పై కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
Indian Telecommunication Bill 2022 ఏం చెబుతోంది?
ఇండియన్ టెలీకమ్యూనికేషన్ బిల్ 2022 చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటోంది. భారత్ లో ప్రస్తుతం కార్యాకలాపాలు నిర్వహిస్తోన్న అన్ని కాలింగ్ మరియు మెసేజింగ్ యాప్స్ ఇకపై కాలింగ్ సర్వీస్ అందించేందుకు జియో, ఎయిర్టెల్, వీఐ కంపెనీల్లాగా ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ లైసెన్స్ కోసం, భారీ మొత్తాన్ని ఫీజు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి యాప్స్ చెల్లించాల్సి ఉంటుంది.
యాప్ కాలింగ్ కి డబ్బులు కట్టక తప్పదు
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న టెలీకమ్యూనికేషన్ 2022 బిల్ పై అక్టోబర్ 20 వరకు ప్రజాభిప్రాయన సేకరణ ఉంటుంది. తర్వాత సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని బిల్లు ని పాస్ చేయడం జరుగుతుంది. ఈ బిల్లు ద్వారా వాట్సాప్, జూమ్, గూగుల్ డువో వంటి యాప్స్ ని టెలీకామ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే మెసేజింగ్ యాప్స్ తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని కూడా ఈ బిల్లు లోకి తీసుకొచ్చారు. మరి ఓటీటీ సంస్థలకు ఎటువంటి నిబంధనలు, లైసెన్స్ లు వర్తించనున్నాయో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్ళు స్వేచ్చను అనుభవించిన ఓటీటీ సైట్స్, మెసేజింగ్ యాప్స్ ఇకపై ప్రభుత్వ నిఘా నీడలోకి రాబోతున్నాయి.
మరి ఈ ఆకస్మిక మార్పులపై జనాలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరీ ముఖ్యంగా వాట్సాప్ కాల్స్ కి డబ్బులు చెల్లించడాన్ని సామాన్యులు తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం. వాట్సాప్ పుణ్యమా అని ఉన్నోడు లేనోడు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఎక్కడున్నా సరే తమ వారికి దగ్గరున్నామనే భావనలో ఉండే వారు. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కూడా ప్రజల దగ్గర నుంచి లాగేసుకుంటే, సగటు మనిషి హర్షించడు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.













