హైలైట్స్:
- ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి, ముంబై లో ఘటన
- బ్యాటరీ పేలినప్పుడు చార్జింగ్ లో ఉన్న స్కూటర్
- ఇంకా బయటకు రాని స్కూటర్ మోడల్ మరియు కంపెనీ పేరు
ముంబైలోని వాసై ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ళ బాలుడు మృతి చెందాడు. స్కూటర్ చార్జింగ్ లో ఉండగా బ్యాటరీ పేలింది. అప్పుడు బాలుడు పక్కనే నిద్రిస్తున్నట్లు సమాచారం. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
ముంబై లోని వాసై (ఈస్ట్) ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బ్యాటరీ పేలినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్ద చార్జింగ్ లో ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, రాందాస్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ 23 న ఉదయం 4.30 నుంచి 5.00 గంటల మధ్య పేలుడు సంభవించింది. ఘటన జరిగిన సమయంలో మృతుడు షబ్బీర్ అన్సారి తన నానమ్మతోపాటు హాల్ లో నిద్రిస్తున్నాడు.
అన్సారి తండ్రి తాను పడుకునే ముందు బ్యాటరీకి చార్జింగ్ పెట్టి తన గదిలోకి వెళ్ళాడు. భారీ శబ్దం రావడంతో బాలుడి తల్లిదండ్రులు మేలుకున్నారు. ఇక బాలుడి నానమ్మకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. 70 శాతం గాయాలైన అన్సారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అన్సారి కన్ను మూశాడు.
బ్యాటరీని ఎంతసేపు చార్జింగ్ పెట్టారో తెలియదని పోలీసులు చెప్పారు. ఘటనకు ముందు రాత్రి 2.30 గంటలకు స్కూటర్ చార్జింగ్ పెట్టామని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. అంటే పేలుడు జరిగేందుకు రెండు గంటల ముందు చార్జింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.
బాధిత కుటుంబం ఏ మోడల్, ఏ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాడుతుందో ఇంకా తెలియలేదు. ఏదేమైనా, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల పేలుడు ఉదంతాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీలకు నిప్పంటుకోవడం, పేలడం, జనాలు ప్రాణాలు కోల్పోవడం సాధారణమై పోయింది. దీంతో ఈ-స్కూటర్లు కొనాలంటేనే జనాలు వణుకుతున్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం కూడా ఈవీ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గత నెలలో సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో మంటలు వ్యాపించడంతో 8 మంది దుర్మణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఉదంతాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో మరి.
అంతకు ముందు, ఇటువంటి ఘటనే కేరళ లోని కోలికోడ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో 12 స్కూటర్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ స్కూటర్ బ్యాటరీ సమస్యను సరిచేస్తుండగా ఉన్నట్లుండి మంటలు చెలరేగాయని సమాచారం. ఆ వెనువెంటనే మిగతా స్కూటర్లకు కూడా మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు వ్యాపించాయి.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలతోనే పేలుడు ఉదంతాలు సంభవిస్తున్నాయని ఏథర్ కంపెనీ సీఈవో అన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల పేలుళ్ళను నివారించేందుకు ఓలా కంపెనీ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని రూపొందిస్తోంది. ఓలా కంపెనీ ఈ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఏదేమైనా, ఎవరో ఒకరి ఆవిష్కరణతో ఈ బ్యాటరీ పేలుళ్ళకు చెక్ పడాలని ఆశిద్దాం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












