హైలైట్స్
- స్క్రాప్ మెటీరియల్ తో ఎలక్ట్రిక్ బండిని తయారు చేసిన వ్యక్తి
- ఇంకా సేల్ కి అందుబాటులోకి తీసుకురాని యజమాని
- సేల్ కి వస్తే రూ.35,000 కే మీ సొంతం కానున్న ఎలక్ట్రిక్ బైక్

ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో జనాలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ బండ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. రేంజ్, పెర్ఫామెన్స్ కావాలంటే ఎక్కువ సొమ్ము చెల్లించాల్సిందే. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు మార్కెట్ లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎన్నో ఎలక్ట్రిక్ వెహికిల్ బ్రాండ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్న వారి కోసం పంజాబ్ కి చెందిన నౌషా అనే వ్యక్తి ఓ పరిష్కారం చూపించాడు. ఇతడు తన వద్ద ఉన్న స్క్రాప్ మెటీరియల్ వాడి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని తయారు చేశాడు.
Nausha ఎలక్ట్రిక్ స్కూటర్ / మోటర్ సైకిల్
నౌషా ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ సంస్థ చైనా నుంచి ఈవీ (EV) భాగాలను దిగుమతి చేసుకుని బ్రాండ్ నేమ్ తగిలుంచుకుని మార్కెట్ లోకి వచ్చిన కంపెనీ కాదు. ఈ బండి ఇంకా సేల్ కి కూడా రాలేదు. ఈ బండి ఓనర్ తన అభిరుచి, ఆసక్తి మేరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూపొందించాడు.
తాను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పూర్తిగా స్క్రాప్ మెటీరియల్ వాడి తయారు చేసినట్లు చెబుతున్నాడు. బండిని తయారు చేసేందుకు అవసరమైన స్క్రాప్ వస్తువులను ఆచితూచి ఎంచుకున్నట్లు నౌషా తెలిపాడు. సిలిండర్ షేప్ లో ఉన్న బండి యొక్క మధ్య భాగాన్ని చూస్తుంటే, వ్యవసాయానికి వాడే సబ్మెర్సిబుల్ బోర్వెల్ మోటర్ గా కనిపిస్తోంది.
10 ఇంచుల సైజు ఉన్న వీల్స్ ని ఇందులో వినియోగించారు. సస్పెన్షన్ కంపోనెంట్స్ ని ఇతర పాత ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి సేకరించి వాడారు. అంతా స్క్రాప్ మెటీరియల్ వాడినట్లు నౌషా చెబుతున్నప్పటికీ, హబ్ మోటర్, బ్యాటరీ మరియు కంట్రోలర్ వేరే కంపెనీ యొక్క ఈవీ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సిలిండ్రికల్ హౌజింగ్ లో బ్యాటరీ, కంట్రోలర్, బీఎంఎస్ తదితర కంపోనెంట్స్ ని అమర్చడం జరిగింది. ఇక హబ్ మోటర్ ని బండికి వెనక భాగంలో పెట్టారు. పసుపు మరియు నలుపు రంగులున్న రెండు ప్రోటోటైప్స్ ప్రస్తుతం నౌషా వద్ద ఉన్నాయి. పసుపు కలర్ మోడల్ లో ఫ్రంట్ డ్రమ్ బ్రేక్స్ ఉండగా, వెనకవైపు లేవు. ముందు ఎల్ఈడీ హెడ్ లైట్, వెనకాల ఎల్ఈడీ టెయిల్ లైట్ ఉన్నాయి.
లాంచ్ మరియు ధర
తన తొలి ప్రోటోటైప్ ని తయారు చేసేందుకు రూ.40,000 ఖర్చైందని నౌషా చెబుతున్నాడు. ఈ మొదటి ప్రోటోటైప్ లో ఎన్నో బ్యాడ్ డిజైన్ చాయిసెస్ కనిపిస్తున్నాయి. అవన్నీ సరిచేసి ఈ బండిని అమ్మాల్సి ఉంటుందని నౌషా చెప్పాడు. అప్పుడు బండి ధర కేవలం రూ.35,000 గా ఉంటుందని నౌషా తెలిపాడు. భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచే గాక, విదేశాల నుంచి కూడా తనకు ఆర్డర్స్ వస్తున్నట్లు నౌషా వెల్లడించాడు. భవిష్యత్తులో తన బండికి రీజనరేటివ్ బ్రేకింగ్ ని యాడ్ చేయాలనుకుంటున్నట్లు నౌషా తెలిపాడు.
ఏది ఎలా ఉన్నా, ఇతని పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. స్క్రాప్ మెటీరియల్ వాడి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయడం గొప్ప విషయమే.
Note: ఇది అమ్మకానికి పూర్తి సంసిద్ధతతో ఉన్న ఉత్పత్తి కాదు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.