Home News మొబైల్ ఫోన్ పేలి కేరళలో 8 ఏళ్ళ బాలిక మృతి

మొబైల్ ఫోన్ పేలి కేరళలో 8 ఏళ్ళ బాలిక మృతి

Pic: mathrubhumi.com

Highlights
  • కేరళలో చోటు చేసుకున్న విషాద ఘటన
  • మొబైల్ ఫోన్ పేలి 8 ఏళ్ళ బాలిక దుర్మరణం
  • చార్జింగ్ లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడుతుండగా పేలిన ఫోన్

మొబైల్ ఫోన్లు పేలిన సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలతో జనాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఫోన్ ఎప్పుడు పేలుతుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. అయితే ఏ ఫోన్ అయినా సరే అంత ఈజీగా పేలదు. మన పొరబాటు కూడా అందుకు ఎక్కువ శాతం కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. మరీ ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఫోన్ ని అస్సలు వాడకూడదు. ఇటీవలె చార్జింగ్ లో ఉన్న ఫోన్ ని ఆపరేట్ చేస్తూ యూపీకి చెందిన ఒక బాలుడు మృతి చెందిన వార్తను మనం చదివాం. ఇప్పుడు ఆ ఘటనను మరవకుండానే, మరొక ఘటన కేరళలో చోటు చేసుకుంది.

కేరళలోని త్రిస్సూరు లో సోమవారం నాడు, అనగా ఏప్రిల్ 24 వ తేదీన ఒక 8 ఏళ్ళ బాలిక ఫోన్ పేలిన ఘటనలో దుర్మరణం పాలైంది. వివరాలు చూస్తే, సదరు బాలిక ఫోన్ చార్జింగ్ లో ఉండగా, గేమ్స్ ఆడుతోందని సమాచారం. అప్పుడు ఉన్నట్లుండి బాలిక చేతిలోనే ఫోన్ పేలింది.

3 వ క్లాసు చదువుతోన్న బాలిక

కేరళ రాష్ట్రం త్రిస్సూరు లోని తిరువిల్వామల లో ఉన్న క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్ లో ఆదిత్యశ్రీ 3 వ క్లాస్ చదువుతోంది. పట్టిపరంబు ప్రాంతంలో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.

తమ నిర్లక్ష్యం వల్లనే తమ పాప ఆదిత్యశ్రీ చనిపోయిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఫలితం అందించని మెరుగైన చికిత్స

మొబైల్ ఫోన్ పేలిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన పాప ఆదిత్యశ్రీ కి సమీపంలోని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఘటన చోటు చేసుకున్నప్పుడు మొబైల్ ఫోన్ చార్జింగ్ లో ఉన్నట్లు సమాచారం. అలాగే ఉంచి మొబైల్ లో గేమ్స్ ఆడటంతో ఫోన్ బాగా వేడెక్కి పేలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

ఘటనపై స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం మరింత కచ్చితమైన సమాచారం బయటకు రానుంది.

3 ఏళ్ళ క్రితం కొనుగోలు చేసిన ఫోన్

రిపోర్ట్స్ ప్రకారం, పేలిన ఫోన్ ని మూడేళ్ళ క్రితం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాదే ఫోన్ బ్యాటరీని కూడా మార్చినట్లు సమాచారం. ఘటన జరిగినప్పుడు ఆదిత్యశ్రీ తన నానమ్మతో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారికి ముఖంపై, చేతులపై తీవ్రగాయాలయ్యాయి.

ఏదేమైనా భవిష్యత్తుని మనం ఊహించలేం. కాబట్టి, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్ ని చార్జింగ్ లో పెట్టి కాల్స్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం లేదా మరేదైనా చెక్ చేయడం చేయకండి. చార్జింగ్ లో ఉన్నప్పుడు కాల్ వస్తే, ముందుగా స్విచ్ ని ఆఫ్ చేసి తర్వాత ఫోన్ ని మీ చేతుల్లోకి తీసుకోండి. పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు చార్జింగ్ ని తొలగించి వారికి ఫోన్ ఇవ్వండి. అలాగే ఫోన్ వేడెక్కేంత వరకు గేమ్స్ ని ఆడకుండా చూసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.