మొబైల్ ఫోన్ పేలుళ్ళు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో స్మార్ట్ఫోన్లు పేలిన ఘటనలు వార్తల్లోకెక్కుతున్నాయి. కారణాలేవైనా పేలుళ్ళు ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్ర లోని నాసిక్ లో ఓ ఇంట్లో మొబైల్ ఫోన్ పేలింది. ఈ పేలుడు దాటికి పలువురికి గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఇంటి కిటికీలు కూడా బద్ధలైపోయాయి. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ పేలిన ఘటనలో ఇంత తీవ్రత ఉన్న పేలుడు ఇదేనని భావిస్తున్నారు.
పేలిన డియొడరెంట్
NDTV కథనం ప్రకారాం, ఘటన సంభవించినప్పుడు ఫోన్ చార్జింగ్ లో ఉంది. ఫోన్ బ్రాండ్ కి సంబంధించిన సమాచారం తెలియదు. అయితే, ఫోన్ కి సమీపంలో ఒక సెంటు బాటిల్ ఉందని తెలుస్తోంది. దీంతో బ్లాస్ట్ మరింత తీవ్రతరమైనట్లు తెలుస్తోంది.
డియోడరెంట్ బాటిల్ పేలుడు ధాటిని తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే, మనం వాడే డియోడరెంట్స్ లో పేలే గుణం కలిగిన ఎన్నో పదార్థాలు ఉంటాయి. పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యేందుకు ఒక చిన్న నిప్పురవ్వ చాలు.
ఘటనలో ముగ్గురికి గాయాలు
అత్యంత శక్తివంతంగా జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇంట్లో ఉన్న గ్లాస్, విండోస్ బద్ధలైపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇంటికి దగ్గరగా నిలిపి ఉంచిన వాహనాలు సైతం పేలుడు ప్రభావానికి గురైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
అసలు ఫోన్లు ఎందుకు పేలుతాయి?
- బ్యాటరీలో లోపం ఉంటే మొబైల్ ఫోన్లు పేలుతుంటాయి. పేలుడు సంభవించడానికి గల కారణాలలో ఇది అత్యంత సాధారణమైనది.
- పాత స్మార్ట్ఫోన్ బ్యాటరీలు ఉబ్బి తర్వాత పేలుతాయి. ఇలా బ్యాటరీ ఉబ్బిన తర్వాత చార్జ్ చేస్తే పేలేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. బ్యాటరీలు ఉబ్బినట్లు మీరు గమనిస్తే, వెంటనే జాగ్రత్త పడండి.
- లోపంతో ఉన్న బ్యాటరీ లేదా చార్జర్ షార్ట్ సర్క్యూట్ కి దారి తీసి ప్రమాదానికి కారణం కావచ్చు.
- ఇవి తరచూ మనకు కనిపించే కారణాలు. కానీ, ప్రస్తుతం జరిగిన ఘటనలో పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాతే అసలు నిజాలు బయటకు వస్తాయి.
