రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఆన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎమ్) తేదీ ప్రకటన వచ్చింది. 46 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2023 ఆగస్టు 28 న ప్రారంభం కానుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు కంపెనీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ మీటింగ్ లో చేయబోయే ప్రకటనల గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. కానీ, ఆ రోజున ముకేశ్ అంబాని తమ జియో 5జీ ప్లాన్, జియో ఫోన్ 5 ని లాంచ్ చేయనున్నారు.
రిలయన్స్ ఏజీఎమ్ 2023 నుంచి ఏమి ఆశించవచ్చు?
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ డేట్ ని ప్రకటించడం తప్పితే, కంపెనీ ఎటువంటి అధికార సమాచారం ఇవ్వలేదు. కానీ, అయితే ఏజీఎమ్ ఈవెంట్ లో ముకేశ్ అంబాని జియో 5జీ ప్లాన్, జియో 5జీ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ప్రకటన చేస్తారని అంతా అంచనా వేస్తున్నారు.
Jio 5G Plan
జియో 5జీ సేవలు ఇప్పటికే దేశంలోని వేల కొలదీ పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే, 2024 కల్లా పూర్తిస్థాయిలో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయనున్నారని సమాచారం. మరోవైపు జియో సంస్థ ఇంకా తన 5జీ రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేయాల్సి ఉంది. యూజర్లు 4జీ ప్లాన్స్ పైనే 5జీ సేవలను కూడా పొందుతున్నారు. ఏజీఎమ్ లో జియో తన 5జీ సేవలను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. 4జీ ప్లాన్స్ తరహాలోనే 5జీ రీచార్జ్ ప్లాన్స్ ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
Jio Phone 5G
జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఒక చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ ని తీసుకురానుందని 2020 లో ముకేశ్ అంబాని ప్రకటించారు. అయితే అప్పటి నుంచి జియో 5జీ ఫోన్ గురించి పెద్దగా ఏ వార్త వినిపించలేదు. కానీ, ఆగస్టు 28 న ఫోన్ లాంచ్ కానుందని చెబుతున్నారు.
2022 డిసెంబర్ లో JioPhone 5G బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో కనిపించింది. ఆమధ్య ఫోన్ లైవ్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి.
