హైలైట్స్:
- భారత్ లో ఐఫోన్స్ ఉత్పత్తి చేసేందుకై జాయింట్ వెంచర్ ప్రారంభించనున్న టాటా గ్రూప్, తైవాన్ కి చెందిన విస్ట్రన్ కార్పొరేషన్, కొనసాగుతోన్న చర్చలు
- విస్ట్రన్ యొక్క ఇండియా ఆపరేషన్స్ లో షేర్స్ కొన్న టాటా, సదరు కంపెనీతో కలిసి కొత్త అసెంబ్లీ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని యోచన
- కొత్త వెంచర్ తో, ప్రస్తుతం విస్ట్రన్ భారత్ లో ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్స్ కంటే 5 రెట్లు అధికమవ్వనున్న ఉత్పత్తి సామర్థ్యం
ఇటీవలె ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ను గ్లోబల్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాటా గ్రూప్, తైవానీస్ సప్లయ్యర్ విస్ట్రన్ కార్పొరేషన్ కలిసి భారత్ లో ఆపిల్ ఫోన్లను తయారు చేసేందుకై ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఆమేరకు బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ఉప్పు, ఉక్కు, సాఫ్ట్వేర్ రంగాలలో తనదైన ముద్ర వేసిన టాటా, ఐఫోన్స్ ని తయారు చేయనున్న మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించనుంది.
iPhones తయారు చేయనున్న మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలవనున్న Tata?
అసలైతే ఆపిల్ ఫోన్లను విస్ట్రన్ కార్పొరేషన్, ఫాక్స్కాన్ టెక్నాలజీ తయారు చేస్తాయి. భారత్ మరియు చైనాల్లో ఈ కంపెనీలు ఫోన్లను అసెంబుల్ చేస్తాయి. స్మార్ట్ ఫోన్ల తయారీ, ఉత్పత్తి, అమ్మకాల విషయంలో చైనా ఆదిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రంగాల్లో చైనాది అగ్రస్థానమని చెప్పాలి. అయితే కొవిడ్ లాక్డౌన్స్, తదనంతర పరిణామాలతో గ్లోబల్ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ వరుసలో ఆపిల్ కూడా ఉంది. చైనాతో పాటు భారత్ తదితర దేశాల్లో కూడా ఆపిల్ ఉత్పత్తులను తయారు చేయాలని ఆపిల్ కంపెనీ భావిస్తోంది.
దీంతో ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఫోన్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టాలని టాటా గ్రూప్ డిసైడ్ అయ్యింది. అందుకే విస్ట్రన్ గ్రూప్ తో టాటా గ్రూప్ చర్చలు జరిపినట్లు సమాచారం. విస్ట్రన్ ఇండియాలో ఈక్విటీలు కొనుగోలు చేయడం, లేదా రెండు సంస్థలు కలిసి ఒక కొత్త అసెంబ్లీ ప్లాంట్ ను ఏర్పాటు చేయడమో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు కంపెనీల మధ్య డీల్ కుదిరితే, ఇకపై భారత్ లో జరుగుతోన్న ఐఫోన్ ఉత్పత్తి శాతం 5 రెట్లు పెరగనుంది. ప్రస్తుతం అదే ప్రథమ లక్ష్యంగా రెండు కంపెనీలు కూడా అడుగులు వేస్తున్నాయి.
ఇప్పటికే ఉప్పు, ఉక్కు, సాఫ్ట్వేర్ రంగాలలో తనదైన ముద్ర వేసిన టాటా, ఐఫోన్స్ ని తయారు చేయనున్న మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించనుంది. అయితే టాటా గ్రూప్, విస్ట్రన్ కార్పొరేషన్ కి మధ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇప్పటికి అధికారికంగా బయటకు రాలేదు. అయితే త్వరలోనే ఇరు కంపెనీలు ప్రకటన చేసే అవకాశముంది. ఏదేమైనా భారత్ లో ఐఫోన్స్ ని టాటా కంపెనీ తయారు చేయనుండటం భారతీయులకు శుభవార్తేనని చెప్పాలి.
లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.