హైలైట్స్
- కర్ణాటకలోని హోసూరుకి సమీపంలో రానున్న అతిపెద్ద Apple iPhones తయారీ కేంద్రం
- ఈ హబ్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించిన టెలీకామ్, ఐటీ మరియు రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్
- ఐఫోన్స్ తయారు చేసేందుకు శిక్షణ తీసుకున్న 6 వేల మంది గిరిజన మహిళలు
బెంగళూరు హోసూరుకి సమీపంలో Apple iPhones యొక్క అతిపెద్ద తయారీ కేంద్రం రాబోతోంది. ఈ పరిశ్రమ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని భారతీయ టెలీకామ్, ఐటీ మరియు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ల తయారీపై ఇప్పటికే రాంచీ, హజారీభాగ్ లకు చెందిన 6,000 మందికి పైగా గిరిజన మహిళలు శిక్షణ పొందినట్లు మంత్రి తెలిపారు. వీరంతా త్వరలోనే విధుల్లో చేరతారని మంత్రి అన్నారు.
భారత్ కి కలిసొచ్చిన చైనా కొవిడ్ నిబంధనలు
భారత్ లో ఐఫోన్స్ తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ని ఇటీవలె టాటా ఎలక్ట్రానిక్స్ పొందింది. దీంతో హోసూరులో ప్లాంట్ ని టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయబోతోంది. ఇదివరకు ఫాక్స్కాన్, విస్ట్రన్, పెగట్రాన్ సంస్థలు భారత్ లో ఐఫోన్లను తయారు చేశాయి. ఫాక్స్కాన్ కి తమిళనాడులోని శ్రీపెరుంబుదుర్ లో ఫెసిలీటీ సెంటర్ ఉండగా, పెగట్రాన్ కి చెన్నైకి సమీపంలో ప్లాంట్ ఉంది. ఇక విస్ట్రన్ కి బెంగళూరులో అసెంబ్లీ ప్లాంట్స్ ఉన్నాయి.
టాటా గ్రూప్, తైవానీస్ ఆపిల్ సప్లయ్యర్ తో కలిసి ఐఫోన్స్ ని భారత్ లో అసెంబ్లింగ్ చేసేందుకు ఒక జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేయబోతోంది. ఇది విజయవంతమైతే, ఐఫోన్లను తయారు చేయనున్న తొలి భారతీయ కంపెనీగా టాటా నిలుస్తుంది. దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆదిపత్యం చెలాయిస్తోన్న చైనాకు భారత్ గట్టి సమాధానం ఇచ్చినట్లవుతుంది.
18 నుంచి 24 నెలల కాల వ్యవధిలో 45,000 మంది మహిళలను విధుల్లోకి తీసుకోవాలని టాటా ప్లాన్ చేస్తోందని బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఐఫోన్స్ యొక్క మెకానిక్స్ మరియు కేసింగ్స్ ని ఉత్పత్తి చేస్తోన్న ఫ్యాక్టరీలో 10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
చైనాలోని జెంగ్జౌ లో Foxconn కి ఐఫోన్స్ తయారీ కోసం అతిపెద్ద ప్లాంట్ ఉంది. అయితే ఆ ప్రాంతంలో కఠినమైన కొవిడ్ నిబంధనల కారణంగా ఐఫోన్ల ఉత్పత్తి నెమ్మదించింది. దీంతో iPhone 14 Pro, Pro Max ఫోన్ల పంపిణీలో జాప్యం నెలకొంది. ఫోన్లను బుక్ చేసుకున్న కస్టమర్లు రోజుల తరబడి షిప్పింగ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆపిల్ భారత్ మరియు ఇతర దేశాల్లో ఐఫోన్స్ తయారీని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది.
తాజా పరిణామాలతో తైవాన్ కి చెందిన Foxconn భారత్ లో తన వర్క్ఫోర్స్ ని 70,000 కి పెంచుకోవాలని నిర్ణయించింది. అంటే రానున్న రెండేళ్ళలో 53,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని ప్రణాళిక వేసుకుంది. 2019 లో ఫాక్సాన్ ఆపరేషన్స్ ని మొదలుపెట్టింది. భారత్ లో తయారైన 85 శాతం ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి అవుతుండగా, మిగతా 15 శాతం భారత్ లో అమ్ముడవుతున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












