హైలైట్స్:
- ఇటీవలి చోటుచేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల ఫైర్ ఇన్సిడెంట్స్ పరిశ్రమకు సాయమే చేస్తున్నాయంటోన్న ఏథర్ సీఈవో తరుణ్ మెహ్తా
- ఈ ఘటనల వల్ల కంపెనీలు నాణ్యతపై ఫోకస్ పెడుతున్నట్లు చెప్పిన తరుణ్ మెహ్తా
- క్వాలిటీకి ప్రాధాన్యతను ఇస్తూనే, ఉత్పత్తిని పెంచే ఆలోచన చేస్తున్నామని తెలిపిన తరుణ్
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోయిన ఉదంతాలు చాలానే చూశాం. అయితే వీటిపై తాజాగా ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహ్తా స్పందించారు. ఆయన పరిస్థితుల పట్ల పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ట్రాక్ రికార్డ్ కలిగిన ఏథర్ సంస్థ సామర్థ్యమున్న బండ్లను అందిస్తూ, వినియోగదారుల నమ్మకాన్ని పొందుతూ వస్తోంది. అందుచేతనే తరుణ్ మెహ్తా, ఆశావహంగా కనిపిస్తున్నారు. ఈవీ ఫైర్ ఉదంతాలు ఇండస్ట్రీకి మేలు చేస్తున్నాయని ఆయన అన్నారు. దీని వల్లన కంపెనీలు క్వాలిటీపై ఫోకస్ పెడుతున్నట్లు మెహ్తా చెప్పారు.
దేశంలో తొలినాళ్ళలో మొదలైన ఈవీ స్టార్ట్అప్స్ లో ఏథర్ ఎనర్జీ ఒకటి. ప్రారంభం నుంచి మంచి వెహికిల్స్ ని అందిస్తూ, కస్టమర్లలో నమ్మకాన్ని సంపాదించింది. అలాగే భారత్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కొత్త కంపెనీలు ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ప్యూర్ఈవీ వంటి సంస్థల నుంచి పోటీ ఉన్నప్పటికీ, బలంగా నిలబడటం ఏథర్ కే చెల్లింది.
ఓవైపు ఈవీలు కాలిపోతున్నప్పటికీ, పాజిటివ్ గానే ఉన్న Ather CEO
గత కొన్నాళ్లుగా ఏథర్ సాధించిన విజయాలు, ప్రజల్లో తమ బండ్ల పట్ల ఏర్పడిన నమ్మకం వెరసి ఏథర్ సీఈవో తరుణ్ మెహ్తా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. భారత్ లో ఇటీవల ఎలక్ట్రిక్ బండ్లు కాలిపోతున్న ఉదంతాలపై ఏథర్ సీఈవో స్పందించారు. ఆశ్చర్యకరంగా ఆయన పాజిటివ్ గా స్పందించారు. అలాగే ఈ ఘటనలు క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేలా చేస్తున్నాయని అన్నారు.
కండీషన్ లో ఉన్న తమ కంపెనీ తయరు చేసిన బండి ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కాలిపోలేదని తరుణ్ మెహ్తా గర్వంగా చెప్పారు. అయితే ఇటీవలె కాలి పోయిన ఏథర్ ఈవీ ఘటనపై మాట్లాడిన ఆయన, అది అంతకు ముందే ఓ యాక్సిడెంట్ కు గురైనట్లు వివరించారు. ఏథర్ ఎల్లప్పుడూ నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.
ఈ దశాబ్దం ముగిసే నాటికి భారత్ లో 20 నుంచి 30 మిలియన్ల విద్యుత్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతాయని తరుణ్ మెహ్తా అంచనా వేస్తున్నారు. ఏథర్ కూడా నిర్ధిష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు సదరు కంపెనీ సీఈవో మాటల ద్వారా స్పష్టమవుతోంది. “రానున్న కొన్నేళ్ళలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టబోతున్నాం. తొలి రెండు ప్లాంట్స్ ఆరంభానికి సూచికలు మాత్రమే.” అని తరుణ్ చెప్పారు.
ఇటీవలె ఏథర్ రూ.989 కోట్ల ఫండింగ్ ను రాబట్టడంలో సఫలమైంది. దీంతో కంపెనీ తన ఉత్పాదక శక్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రీసెంట్ గా ఏథర్ నుంచి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 అనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి ఏథర్ భారత్ లో భారీ లక్ష్యంతోనే పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. రానున్న రోజుల్లో ఏథర్ నుంచి ఇంకా ఎటువంటి వాహనాలు వస్తాయో చూడాలి.