హైలైట్స్:
- తమ కంపెనీలు మెర్జ్ అవుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన ఓలా, ఉబర్ ఇండియా
- తమ కంపెనీ లాభాల్లో దూసుకెళ్తోందని, ఎటువంటి మెర్జింగ్ కి చూడటం లేదని స్పష్టం చేసిన ఓలా సీఈవో
- వార్తలను ఖండించిన ఉబర్, భారత మార్కెట్లో కొనసాగుతామని స్పష్టీకరణ

భారత్ లో పాపులర్ క్యాబ్ ఆపరేటర్లైన ఓలా, ఉబ్ ఇండియా లు కలిసిపోతున్నాయంటూ ఇటీవలె పలు కథనాలు బయటకు వచ్చాయి. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉబర్ ఎగ్జిక్యూటివ్స్ ని కలిసినట్లు ఈటీ ఓ వార్తను ప్రచురించింది. అయితే, ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన ట్వీట్ తో బలమైన సమాధానం ఇచ్చారు. మెర్జర్ వార్తలను ఖండించిన భవిష్, అటువంటి ఆలోచనేది లేదని చెప్పారు. సదరు వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. తమ సంస్థ మాంచి లాభాల్లో దూసుకెళ్తోందని భవిష్ చెప్పారు.
అలాగే ఉబర్ కి కూడా భవిష్ చురకలు అంటించారు. అయితే పేరును నేరుగా ప్రస్తావించలేదు. “ఏదైనా కంపెనీ భారత మార్కెట్ నుంచి వైదొలగాలనుకుంటే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తాం. మేము మాత్రం అస్సలు మెర్జ్ అయ్యేదే లేదు.” అని తన ట్వీట్ లో భవిష్ రాసుకొచ్చారు.
Ola మరియు Uber మెర్జర్ రిపోర్ట్స్
ఉబర్ ఇండియా, ఓలా సంస్థలు కలిసిపోతున్నాయని వచ్చిన వార్తలను ఓలా సీఈవో భవిష్ ఖండించారు. సదరు వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ఓలా చక్కటి లాభాలతో, ముందుకు దూసుకెళ్తోందని, మెర్జెర్ వంటి ఆలోచనలు అస్సలు లేవని ఆ కంపెనీ సీఈవో అన్నారు.
ఈ వార్తలు నిజమో కాదో తెలుసుకునేందుకు, ఇండియా టుడే టెక్ ఉబర్ టీమ్ ని సంప్రదించింది. అప్పుడు ఉబర్ కూడా మెర్జర్ వార్తలను ఖండించింది. భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్నారా అన్న ప్రశ్నకు, గతంలో తమ సీఈవో కొస్రోవ్షాహీ చేసిన ట్వీట్ తో బదులిచ్చింది.
తాము ఓలా తో మెర్జర్ కు సంబంధించిన ఎటువంటి సంప్రదింపులు జరపలేదని, ఉబర్ కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మరి భారత మార్కెట్ నుంచి ఉబర్ వైదొలగాలని భావిస్తోందా అన్న ప్రశ్నకు, ఉబర్ సీఈవో కోర్సోవ్షాహీ గతంలో చేసిన ట్వీట్ ను ఉదహరించింది. ఉబర్ సంస్థ భారత్ లో తమ బిజినెస్ ను అమ్మేయాలని చూస్తోందని బ్లూమ్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ కి ఉబర్ సీఈవో గతంలో ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో ఆయన “బ్లూమ్బర్గ్ వారు ఇటువంటి కథను అల్లడం అమేజింగ్, ఈ కథలో ఎటువంటి నిజం లేదు. అసలు అటువంటి చర్చ లేదు, ఆలోచన లేదు. మేం బ్లూమ్బర్గ్ కి ఏమీ చెప్పలేదు. ఇదంతా క్లిక్ బెయిట్ మాత్రమే.” అని చెప్పుకొచ్చారు.
వేగంగా అభివృద్ధి చెందుతోన్నప్పటికీ, ప్రైస్-సెన్సిటివ్ మార్కెట్ అయిన భారత్ లో లాభాలు రాబట్టలేక ఓలా, ఉబర్ లు సతమతమవుతున్నాయని బ్లూమ్బర్గ్ సంస్థ 2022 జూన్ లో ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికాకు చెందిన ఉబర్ సంస్థ భారత్ నుంచి వైదొలుగుతుందని తెలిపింది. అయితే ఫ్యూచర్ గ్రోత్ కోసం భారత్ కు చెందిన తన పోటీదారైన సంస్థతో డీల్ కుదుర్చుకుంటుందని బ్లూమ్బర్గ్ చెప్పింది. గతంలో చైనాలో దిది గ్లోబల్, సౌత్ ఈస్ట్ ఏసియాలో గ్రాబ్ హోల్డింగ్స్ తో ఉబర్ ఇటువంటి ఒప్పందాలు చేసుకుంది.












