
ఇటీవలె ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆపిల్ తన తొలి స్టోర్ ని భారత్ లో తెరిచింది. అయితే తాజాగా ఒక చెడు వార్త ఆపిల్ కి వెల్కమ్ చెప్పింది. ఓ బాలుడు చార్జింగ్ లో ఉన్న ఆపిల్ ఫోన్ ద్వారా షాక్ తగిలి మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో జరిగింది. బాలుడు పేరు సత్యం శర్మ అని అతడి వయసు 14 ఏళ్ళని తెలుస్తోంది. News18 కథనం ప్రకారం, సత్యం ఐఫోన్ చార్జింగ్ అవుతుండగా, అతనికి కాల్ వచ్చిందట. అతడు కాల్ రిసీవ్ చేసుకునేందుకు ఫోన్ ని తీసుకోగా వెంటనే షాక్ తగిలి క్రింద పడిపోయినట్లు సమాచారం.
ఫోన్ ని చార్జింగ్ కేబుల్ నుంచి తొలగించిన వెంటనే తగిలిన షాక్
రిపోర్ట్ ప్రకారం, సోమవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. సత్యం తన స్నేహితులతో ఆడుకుంటుండగా, తన ఫోన్ చార్జింగ్ లో ఉంది. కాల్ వచ్చిన క్రమంలో సత్యం ఫోన్ ని చార్జింగ్ నుంచి తొలగించాడు. ఇక అంతే, అతడికి భారీ షాక్ తగిలింది.
సత్యం స్నేహితుల ప్రకారం, ఫోన్ ని సత్యం చార్జింగ్ నుంచి తొలగించాడట. అతడు ధరించిన స్మార్ట్ వాచ్ లో కూడా రియాక్షన్ వచ్చిందని వారు తెలిపారు. షాక్ తగిలిన వెంటనే అతడు నేలపై పడిపోయినట్లు వారు తెలిపారు. ఆ వెనువెంటనే అతడి శరీరం నల్లబడి పోయిందని వారు అన్నారు.
రెండు రోజుల క్రితం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్న బాలుడు
షాక్ తగిలిన వెంటనే సత్యం ని అతడి బంధువులు సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సత్యం ఇటీవలె 10 వ తరగతి పాస్ అయ్యాడు. అతడికి ఖరీదైన ఫోన్లంటే ఇష్టమని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ కొనుక్కొమని డబ్బులు ఇచ్చారట. అతడు ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు మరణించడం చాలా బాధాకరం. ఇటువంటివి జరగొద్దని 91మొబైల్స్ తెలుగు కోరుకుంటోంది.
ఎవ్వరైనా సరే ఇకపై ఫోన్ చార్జింగ్ లో ఉన్నప్పుడు కాల్ వస్తే సాకెట్ ‘స్విచ్’ ఆఫ్ చేశాక, అప్పుడు కేబుల్ ని ఫోన్ నుంచి తొలగించండి. కాల్ రిసీవ్ చేసుకోవాలనే తొందరలో వెంటనే ఆన్సర్ చేసి మాట్లాడకండి. కాల్స్ ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. కానీ, ప్రాణం విలువైనది తిరిగి రాదు. దయచేసి ఆలోచించండి. ఎలక్ట్రానిక్ వస్తువులను హ్యాండిల్ చేసేప్పుడు జాగ్రత్త వహించండి. ఇటువంటి సందర్భాల్లో నిదానమే ప్రధానం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











