5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం, సోషల్ మీడియాలో BSNL పై ట్రోలింగ్

హైలైట్స్:

  • భారత్ లో మొదలైన 5జీ స్పెక్ట్రమ్ వేలం
  • పాల్గొన్న అదానీ గ్రూప్, జియో, ఎయిర్టెల్, వీఐ
  • సోషల్ మీడియాలో బీఎస్ఎన్ఎల్ పై ట్రోలింగ్

భారత్ యొక్క తొలి 5జీ స్పెక్ట్రమ్ వేలం నేడు జరిగింది. నేడు ఉదయం 10 గంటలకు మొదలైన వేలం, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రూ.4.3 లక్షల కోట్ల విలువ గల, 10 బ్యాండ్స్ పరిధిలోని 72 గిగా హెర్ట్జ్ ఎయిర్ వేవ్స్ కై రిలయన్స్ జియో, ఎయిర్టెల్ టాప్ బిడ్డర్స్ గా నిలవనున్నారని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా సంస్థ తో పాటు, కొత్త పోటీదారు అదానీ కూడా వేలం లో పాల్గొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బిడ్డర్స్ లిస్ట్ లో బీఎస్ఎన్ఎల్ పేరు లేదు. దీంతో అందరూ షాకవుతున్నారు. ఇటు బీఎస్ఎన్ఎల్ యూజర్లు, అటు ఇతర కంపెనీల వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ పరిస్థితిని చూసి నిర్ఘాంతపోతున్నారు.

ప్రభుత్వంచే నడపబడుచున్న బీఎస్ఎన్ఎల్ 5జీ స్పెక్ట్రమ్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి బీఎస్ఎన్ఎల్ 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే, బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ సేవలను అందించడం మొదలుపెట్టాల్సి ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ లక్ష్యం 4జీ సేవలను లాంచ్ చేయడం, 2024 కల్లా 4జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ తరుణంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం జరుగుతుండటంతో అందరి దృష్టి బీఎస్ఎన్ఎల్ పై పడింది. ఇక ఇదే అదనుగా పలువురు నెటిజన్లు, సోషల్ మీడియాలో బీఎస్ఎన్ఎల్ ను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ యూజర్లతో పాటు, నాన్-యూజర్లు కూడా సదరు సంస్థ 5జీ సేవలు అందించాలంటే ఇంకెంత కాలం పడుతుందోనని ఆలోచనలో పడ్డారు. 3300 మెగాహెర్ట్జ్ నుంచి 3670 మెగాహెర్ట్జ్ బ్యాండ్ మధ్యలో తమ కొరకు 70 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ను రిజర్వ్ చేసి ఉంచాలని, టెలీకమ్యూనికేషన్స్ విభాగాన్ని జూన్ నెలలో బీఎస్ఎన్ఎల్ కోరడం జరిగింది. దీంతో ప్రైవేట్ టెలీకామ్ కంపెనీలైన ఎయిర్టెల్, జియో, వీఐ లు 5జీ స్పెక్ట్రమ్ యొక్క చిన్న పూల్ కొరకు బిడ్ వేయాల్సి ఉంటుంది. తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి, బీఎస్ఎన్ఎల్ యొక్క 5జీ స్పెక్ట్రమ్ రిజర్వేషన్ అభ్యర్థనను కేబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది.

4జీ సేవలు లాంచ్ చేసిన ఏడాది లోపలే 5జీ సేవలను అందించగలిగే స్థితిలో బీఎస్ఎన్ఎల్ ఉంటుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కానీ బీఎస్ఎన్ఎల్ ఎప్పుడు 4జీ సేవలను లాంచ్ చేస్తుంది? 2022 ఆగస్టు 15 నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభిస్తుందని కొంతమంది నమ్ముతున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం 2024 లోనే 4జీ సేవలను రోలౌట్ చేయనుందని తెలుస్తోంది. ఈ గందరగోళానికి తెరపడేది ఎప్పుడో తెలియదు. ఎలా చూసినా, ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ దుస్థితిని చూసి, అందరూ పెదవి విరుస్తున్నారు. మరోవైపు, బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులను ఆకర్షించడానికి తక్కువ ధరల్లో ప్లాన్స్ ని అందిస్తోంది. దాంతో, డేటా మరియు కాలింగ్ కోసం ఎక్కువ మొత్తం వెచ్చించలేని వారు, బీఎస్ఎన్ఎల్ చెంతకు చేరుతున్నారు. ఇక 4జీ సేవలపై స్పష్టత రావాలంటే, ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Previous articleభారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్
Next articleబెంగళూరులో కాలిపోయిన OPPO Reno2 స్మార్ట్ ఫోన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.