Ola ఎలక్ట్రిక్ కారు ధరను టీజ్ చేసిన సీఈవో భవీశ్ అగర్వాల్

హైలైట్స్:

  • ప్రీమియమ్, స్పోర్టీ ఎలక్ట్రిక్ కారుతో ఈవీ కార్ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్
  • 500 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఓలా ఎలక్ట్రిక్ కారు, 4 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకోనున్న కారు
  • సీఈవో చెబుతున్న దాన్ని బట్టి, కారు ధర రూ.40-రూ.50 లక్షల మధ్య ఉండే అవకాశం

ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ చెబుతున్న దాన్ని బట్టి, ఓలా ఎలక్ట్రిక్ తన తొలి కారుని భారత్ లో 2024 వేసవి కల్లా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈవీ లకు సంబంధించి ప్రీమియమ్ మార్కెట్ సెగ్మెంట్ లో పాగా వేయాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తన తొలి కారుని స్పోర్టీ ఎలక్ట్రిక్ కారుగా మలుస్తోంది. కార్ బిజినెస్ లో టాప్-డౌన్ విధానంలో ముందుకు వెళ్ళాలని కంపెనీ భావిస్తోంది. దీన్ని బట్టి, తొలుత ప్రీమియమ్ కార్లను లాంచ్ చేసి, తర్వాత తక్కువ ధర కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.

కొత్త ఓలా ఎలక్ట్రిక్ కార్ చాలా ఎక్కువ ధరతో రానుంది. అయితే, కారు త్రిల్లింగ్ పెర్ఫామెన్స్ ఇస్తుందని సీఈవో భవీశ్ అగర్వాల్ చెబుతున్నారు. కారు కేవలం 4 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుందని భవీశ్ తెలిపారు. తమ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్లు పరిగెడుతుందని గతంలో కంపెనీ తెలిపింది.

భారత్ లో Ola ఎలక్ట్రిక్ కారు ధరను టీజ్ చేసిన కంపెనీ

భారతీయ విద్యుత్ వాహనాల అంకుర సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్, ఓలా ఎస్1 ప్రో అనే ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. రీసెంట్ గా ఈ సంస్థ నుంచి ఓలా ఎస్1 అనే ఎంట్రీ-లెవెల్ ఈ-స్కూటర్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ మోడల్ లాంచ్ ఈవెంట్ లో సీఈవో భవీశ్ అగర్వాల్ ఓలా యొక్క తొలి ఎలక్ట్రిక్ కారు గురించి మాట్లాడి అందరిలో ఆసక్తిని పెంచారు.

పీటీఐ తో మాట్లాడి ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్, తమ సంస్థ యొక్క ఈవీ కార్ సెగ్మెంట్ అప్రోచ్ ఎలా ఉండనుందో వెల్లడించారు. టాప్-డౌన్ ఫ్యాషన్ లో తొలుత ప్రీమియమ్ వాహనాలను మార్కెట్ లోకి దింపి, తర్వాత అందుబాటు ధరల్లో కార్లను లాంచ్ చేస్తామని తమ స్ట్రేటజీని వివరించారు.

“మా సంస్థ నుంచి వచ్చే ఉత్పత్తుల ధరలు రూ.1 లక్ష (టూ-వీలర్స్) నుంచి మొదలై రూ.40-50 లక్షల (ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కారు) వరకు ఉంటాయి. మిడ్ సైజ్, స్మాల్, ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లలో గ్లోబల్ లీడర్ గా ఎదగడమే మా సంస్థ లక్ష్యం. భారత్ లో ఈ-కారు ఫాస్టెస్ట్ అండ్ స్పోర్టియెస్ట్ గా ఉంటుంది. 18 నుంచి 24 నెలల్లో మా సంస్థ నుంచి తొలి ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వస్తుంది. 2026 లేదా 2027 కల్లా ఏడాదికి పది లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.” అని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు.