హైలైట్స్:
- త్వరలో చైనాకు చెందిన మొబైల్ ఫోన్లను బ్యాన్ చేయనున్న భారత ప్రభుత్వం
- రూ.12,000 లోపు ధర కలిగిన అన్ని చైనా ఫోన్లు బ్యాన్ అయ్యే అవకాశం, త్వరలోనే భారత ప్రభుత్వం నుంచి రానున్న ప్రకటన
- ఎంఐ, రెడ్మీ, ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్ మీ, ఇన్ఫినిక్స్, టెక్నో కంపెనీలపై పడనున్న ప్రభావం

భారతదేశంలో చైనా స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ కానున్నాయన్న వార్త భారతీయ మొబైల్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించేదే. దీనిలో వాదనలు అనవసరం. ఇక రానున్న రోజుల్లో రూ.12,000 లోపు ధర కలిగిన చైనీస్ స్మార్ట్ ఫోన్స్ భారత్ లో బ్యాన్ కానున్నాయి. షావోమీ, రెడ్మీ, రియల్ మీ, ఒప్పో, వివో, పోకో, ఇన్ఫినిక్స్, టెక్నో కంపెనీలకు చెందిన తక్కువ ధర కలిగిన ఫోన్లు ఇకపై భారతదేశంలో కనిపించకపోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన భారత ప్రభుత్వం నుంచి వెలువడనుంది.
భారత్ లో రద్దుకానున్న China Mobile Phones
రూ.12,000 లోపు ధర కలిగిన చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ భారత్ లో బ్యాన్ కానున్నాయి. దీనిపై త్వరలోనే భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. బ్లూంబర్గ్ కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 150 డాలర్ల లోపు ధర కలిగిన చైనా స్మార్ట్ ఫోన్స్ భారత్ లో బ్యాన్ కాబోతున్నాయని బ్లూంబర్గ్ తెలిపింది. ఈ రిపోర్ట్ కనుక నిజమైతే, లావా, మైక్రోమ్యాక్స్ వంటి భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
ముందు తెలుసుకోవాల్సిందేంటంటే, బ్లూంబర్గ్ కథనంలో ప్రభుత్వం లేదా సోర్స్ కి సంబంధించి ఎటువంటి వివరాలు పేర్కొనబడలేదు. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వ ప్లాన్ గురించి ఏ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టం చేయనుందా? లేదా కొన్ని ఎంపిక చేయబడిన బాడీస్ కి మాత్రమే ఈ బ్యాన్ ను వర్తింపజేస్తుందా? అనే విషయాలు కూడా ఆ కథనంలో తెలపబడలేదు.
BAN ప్రభావం ఎవరిపై పడనుంది?
భారత మొబైల్ మార్కెట్ లోని అగ్రభాగాన్ని చైనా కంపెనీలే ఏలుతోన్న సంగతి తెలిసిందే. వీటిలో షావోమీ, రెడ్మీ, రియల్ మీ, ఒప్పో, వివో, పోకో, ఇన్ఫినిక్స్, టెక్నో కంపెనీలున్నాయి. ఇక భారతీయ వినియోగదారులు కూడా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్, లో బడ్జెట్ మొబైల్ ఫోన్స్ విషయంలో ఈ బ్రాండ్స్ పై గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నిజంగానే రూ.12 వేల ధర లోపు ఫోన్స్ ని బ్యాన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ బ్యాన్ చేస్తే కనుక, ఈ కంపెనీలకు పెద్ద దెబ్బ పడనుంది.
భారత మొబైల్ బ్రాండ్స్ కి ప్రయోజనం
భారత మార్కెట్ లో రూ.12 వేల లోపు ధర కలిగిన చైనా స్మార్ట్ ఫోన్స్ ని బ్యాన్ చేసి భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయనుంది. దీంతో భారత్ లో మైక్రోమాక్స్, లావా వంటి కంపెనీలు మరిన్ని రావడం ఖాయం. అలాగే శాంసంగ్, నోకియా బ్రాండ్లు రూ.12 వేల సెగ్మెంట్ లో భారీ ఎత్తున ఫోన్స్ ని తీసుకొచ్చి, మాంచి లాభసాటి వ్యాపారం చేసే అవకాశముంది.












